పవన్ కళ్యాణ్ ఒక 'మంత్లీ ప్యాకేజీ' స్టార్.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
జడ్చర్ల (Suryanews): జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానాన్ని సినిమా ప్రొడక్షన్లతో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు. పవన్ ఒక 'మంత్లీ ప్యాకేజీ' స్టార్గా మారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రొడ్యూసర్లు ఉంటేనే గెలుపు..
2019 ఎన్నికల్లో సరైన ప్రొడ్యూసర్ లేకపోవడం వల్లే జనసేన ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. అయితే, 2024 ఎన్నికల నాటికి చంద్రబాబు ప్రొడ్యూసర్గా, లోకేష్ కో-ప్రొడ్యూసర్గా దొరకడంతోనే పవన్ కళ్యాణ్ విజయం సాధించారని ఆరోపించారు. ఇప్పుడు తన కుటుంబం పెద్దదైందని, మరిన్ని ప్రయోజనాల కోసం కొత్త ప్రొడ్యూసర్ గా మోదీని తెచ్చుకున్నారని వ్యాఖ్యానించారు.
తెలంగాణ భూములపై కన్ను..
ఆంధ్రప్రదేశ్లో భూములకు రేట్లు లేవని, అందుకే వీరి కన్ను తెలంగాణ భూములపై పడిందని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు నరదిష్టి ఉందంటూ గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ వాసులను అవమానించేలా మాట్లాడే పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ఇక్కడ పోటీ చేసే నాయకులకు కనీస సిగ్గు ఉండాలని ఆయన ఘాటుగా విమర్శించారు.
-సూర్య న్యూస్, జడ్చర్ల

Comments
Post a Comment